మోటరోలా, నథింగ్ స్మార్ట్ఫోన్ ధరల పెంపు ఇండియాలో కొనుగోలుదారులకు ఊహించని షాకిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఎన్విడియా ఏఐ డేటా సెంటర్ల కోసం అవసరమైన హెచ్బీఎమ్ చిప్ల తయారీకి శామ్సంగ్, మైక్రాన్, ఎస్కే హైనిక్స్ వంటి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనివల్ల సాధారణ ఫోన్లలో వాడే డీరామ్ (DRAM), నంద్ (NAND) చిప్ల ఉత్పత్తి తగ్గి వాటి ధరలు 50 నుంచి 60 శాతం పెరిగాయి.
పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిని రవాణా ఖర్చులు పెరిగాయి. అలాగే రూపాయి విలువ తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో.. మోటరోలా ఇండియాలో విక్రయిస్తున్న మోటో జి, ఎడ్జ్ 60 ఫ్యూజన్ మోడళ్ల ధరలను రూ.1,000 నుంచి రూ.2,000 వరకు పెంచింది. మోటో జి35 4GB/128GB మోడల్ ధర రూ.11 వేల 999 నుంచి సుమారు రూ.12 వేల 499– రూ.12,999కి పెరగగా, 8GB/128GB వేరియంట్ ధర ఇప్పుడు రూ.13 వేల 999గా ఉంది.
►ALSO READ | రియల్ ఎస్టేట్ సరికొత్త రికార్డు.. 48శాతం పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్
మోటో జి57 8GB/128GB ధర రూ.14 వేల 999 నుంచి రూ.15 వేల 999కి పెరిగింది. అన్ని Motorola Edge 60 Fusion వేరియంట్ల ధరలు సుమారు రూ.2 వేల వరకూ పెరిగాయి. 8GB/128GB మోడల్ ధర రూ. 20 వేల 999 నుంచి ఇప్పుడు రూ. 22 వేల 999కి పెరిగింది. ఇదిలా ఉండగా.. 8GB/256GB,12GB/256GB వెర్షన్ల ధరలు వరుసగా రూ. 24 వేల 999, రూ.26 వేల 999కి పెరిగాయి. ఈ ధరలు ఏప్రిల్ నుంచే ఆన్ లైన్, ఆఫ్ లైన్లో అమల్లోకి వచ్చాయి.
నథింగ్ కూడా కొత్త మిడ్-రేంజ్ నథింగ్ ఫోన్ (3a) లైట్ ధరలను పెంచింది. 8GB/128GB వేరియంట్ ధర రూ. 21 వేల 999 నుంచి రూ. 24 వేల 999కి పెరిగింది. 8GB/256GB మోడల్ ధర రూ. 23 వేల 999 నుంచి రూ. 26 వేల 999కి పెరిగింది. వివో, శామ్సంగ్, ఒప్పో, రియల్మీ, షావోమీ, నథింగ్ వంటి గ్లోబల్ బ్రాండ్లు ఇండియాలో ధరలను 40 శాతం వరకు పెంచాయి. దీనివల్ల వినియోగదారులు కొత్త ఫోన్లు కొనడం కష్టంగా మారింది.
