రూ. 8 లక్షల లంచం తీసుకుంటూ ..పట్టుబడిన సెంట్రల్ జీఎస్టీ అధికారి

రూ. 8 లక్షల లంచం తీసుకుంటూ ..పట్టుబడిన సెంట్రల్ జీఎస్టీ అధికారి

లంచం తీసుకుంటూ  బెంగళూరులో సెంట్రల్ జీఎస్టీ అధికారి అడ్డంగా దొరికారు.  పెండింగ్ లో ఉన్న జీఎస్ టీ బకాయిలకు సంబంధించిన ఓ కేసులో రూ. 8 లక్షల  లంచం తీసుకుంటూ  సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ మోహిత్ ప్రతాప్ సింగ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. కోరమంగళలోని  సెంట్రల్ సదన్  కార్యాలయంలో  లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. సెంట్రల్ జీఎస్టీ అధికారి పట్టుబడటంతో సోషల్ మీడియా పెద్ద చర్చకు దారి తీసింది. 

లోకాయుక్త ప్రకారం, పెండింగ్‌లో ఉన్న సెంట్రల్  జీఎస్టీ బకాయిలకు సంబంధించి ఫిర్యాదుదారుడైన సయ్యద్ జమీర్‌పై దాఖలైన తప్పుడు కేసును మూసివేయాలంటే  40 లక్షల డబ్బును డిమాండ్ చేశారు. మధ్యవర్తిగా సల్మాన్ షేక్ ఈ లంచాన్ని రూ.20 లక్షల నుంచి తగ్గించడానికి చర్చలు జరపడంలో సాయం  చేశారు. వీరిద్దరినీ అరెస్టు చేసి, అవినీతి నిరోధక చట్టం కింద జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 

లంచం కేసులో  సెంట్రల్ జీఎస్టీ అధికారి  పట్టుబడిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా  చర్చనీయాంశమైంది. అతడిపై చర్యలు ఉంటాయా, కఠినంగా శిక్షిస్తారా  అని పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం  చేస్తున్నారు. కొద్దికాలం నామమాత్రంగా సస్పెండ్ చేసి తిరిగి విధుల్లో తీసుకుంటారని  అంచనా వేస్తున్నారు. జీఎస్టీ శాఖ అవినీతికి కేంద్రంగా మారిందని విమర్శించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.