UPSC అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. కరోనా కారణంగా గతేడాది సివిల్స్ పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి మరో అవకాశం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కరోనాతో చివరి ప్రయత్నం తప్పిపోయిన అభ్యర్థులకు ఇంకో అవకాశం కల్పిస్తున్నట్లు శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
రచ్నా సింగ్ అనే సివిల్స్ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది సుప్రీం కోర్టు. 2020లో చివరి ప్రయత్నం చేస్తోన్న అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చే అంశాన్ని లెక్కలోకి తీసుకోవాలని కేంద్రం, UPSC కమిషన్కు గతేదాడి సెప్టెంబర్లో సూచించింది. అయితే… వారికి మరో అవకాశం ఇవ్వలేమని జనవరిలో కేంద్రం చెప్పింది. ఇది ప్రభుత్వ పరీక్షల వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపింది. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణయంలో మార్పు చేసుకుంటూ..మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
2021లో జరగనున్న సివిల్స్ పరీక్షలకు ఫిబ్రవరి 10 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.