- రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో 2027 మార్చి వరకు గడువు పెంచిన కేంద్రం
- ప్రాజెక్టు పనులకుతొలగిన అడ్డుంకులు
- రాష్ట్రంలో ఈ స్కీమ్ కింద1,796 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేపట్టిన పీఎం కుసుమ్ ప్రాజెక్టు పనుల గడువును మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో 2027 మార్చి వరకు గడువు పెంచింది. రాష్ట్రంలో ఈ స్కీమ్ కింద రైతుల భూముల్లో రూ.6 వేల కోట్లతో 1,796 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రెడ్ కో అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా 2019 మార్చిలో ప్రారంభించిన ఈ స్కీమ్ను గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గ్రీన్ఎనర్జీలో భాగంగా ఈ స్కీం అమలుపై దృష్టిపెట్టారు. ఏడాదిన్నర కాలంగా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి ఈ ప్రాజెక్టును ఒక కొలిక్కి తీసుకొచ్చారు. తీరా పనులు మొదలుపెట్టగానే కేంద్ర ప్రభుత్వం పెట్టిన గడువు ముగిసింది. దీంతో బ్యాంకర్లు నిధులు ఇవ్వడానికి నిరాకరిస్తుండడంతో గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
75 శాతానికి పైగా బ్యాంకుల నిధులే
పీఎం కుసుమ్ స్కీమ్లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి సుమారు. 3.25 కోట్ల చొప్పున మొత్తం రూ.6 వేల కోట్లు ఖర్చు అవుతున్నది. ఇందులో 75 శాతానికి పైగా నిధులను బ్యాంకులు రుణాలుగా అందిస్తున్నాయి. మిగతావి రైతులే పెట్టుబడిగా పెట్టి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో బ్యాంకుల నుంచే రూ.4,500 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,156 మంది రైతులు 1,796.3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి డిస్కమ్లతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు (పీపీఏ) చేసుకున్నారు.
ఇందులో ఎన్పీడీసీఎల్ పరిధిలో 436 మంది రైతులు 631.9, ఎస్పీడీసీఎల్ పరిధిలో 720 మంది రైతులు 1,164.4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల పనులను మొదలుపెట్టారు. మొత్తం 33 సర్కిళ్ల పరిధిలో పనులు మొదలయ్యాయి. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతన్నలు.. సోలార్ పవర్ ప్లాంట్ల పనులు ప్రారంభించారు. సిరిసిల్ల వంటి చోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా చాలా చోట్ల పెండింగ్లో ఉన్నాయి.
అయితే ఈ స్కీమ్ కోసం ఇచ్చిన గడువు ముగియడంతో బ్యాంకర్లు నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఈ విషయం రైతుల నుంచి రెడ్కో ఆఫీసర్లకు తెలియడంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గడువు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రెడ్కో ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్లి మరీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించడంతో 2027 మార్చి వరకు గడువు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడాదిలోపు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం
రాష్ట్రంలో పీఎం కుసుం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది గడువు పెంచింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు చేపడుతున్న రైతులకు మేలు జరిగింది. బ్యాంకర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులు మంజూరు చేయడానికి వీలవుతుంది. రాష్ట్రంలో వచ్చే మార్చి నాటికి మొత్తం 1,796 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం.- అనిల, రెడ్కో వైస్చైర్మన్ అండ్ ఎండీ, హైదరాబాద్
