వైజాగ్‌ ఘటన.. పరిశ్రమలకు కొత్త గైడ్‌లైన్స్‌

వైజాగ్‌ ఘటన.. పరిశ్రమలకు కొత్త గైడ్‌లైన్స్‌
  • జారీ చేసిన కేంద్రం
  • మొదటి వారం ట్రయల్‌గా భావించాలి

న్యూఢిల్లీ: రెండు నెలల సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత తెరుచుకుంటున్న పరిశ్రమలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైజాగ్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన నేపథ్యంలో అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పింది. ఈ మేరకు నేషనల్ప‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ) పరిశ్రమలకు కొత్త గైడ్‌లైన్స్‌ రిలీజ్‌ చేసింది. చాలా రోజులు లాక్‌డౌన్‌ ఉండటం, పారిశ్రామిక యూనిట్లు మూసి ఉండం వల్ల కొంత మంది ఆపరేటర్లు ఎస్‌వోపీని అనుసరించకపోవచ్చని, పైప్‌లైన్‌లు లాంటి తయారీ సంస్థల్లో రసాయనాలు లీక్‌ అయ్యే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించింది. “ యూనిట్లను రీస్టార్ట్‌ చేసేటప్పుడు ఒక వారం ట్రయల్‌ లేదా టెస్ట్‌ రన్‌గా భావించండి. ప్రొటోకాల్‌ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్పత్తులు ఎక్కువగా చేయాలనే తొందరలో ఉండొద్దు. ఎంప్లాయిస్‌ కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. వింత శబ్దాలు, వైర్‌‌లు కాలిన వాసన, వైబ్రేషన్స్‌, స్మోక్‌ ఎక్కువగా రావడం లాంటివి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకోని, సంబంధిత డిపార్ట్‌మెంట్లకు చెప్పాలి. అవసరమైతే షట్‌డౌన్‌ చేయాలి” అని ఎన్‌డీఎమ్‌ఏ సూచించింది. కరోనా వ్యాప్తి చెందకుండా కంపెనీల్లో ఎంప్లాయ్స్‌ తరచూ వాడే ప్రదేశాలను 24 గంటల పాటు శానిటైజ్‌ చేస్తూనే ఉండాలని, కామన్‌ టేబుల్స్‌ అన్నీ నిత్యం క్లీన్‌ చేయాలని చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఈ గైడ్‌లైన్స్‌ పంపించినట్లు అధికారులు చెప్పారు. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్‌ లీక్‌ వల్ల 12 మంది చనిపోగా.. దాదాపు 1000 మంది ఆసుప్రతి పాలయ్యారు.