- ప్రైవేటీకరణ టార్గెట్లు మిస్సే!
- ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత
- మరికొన్ని నెలల్లో ఎన్నికలు
- అందుకే కేంద్రం వెనకడుగు
న్యూఢిల్లీ : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వ కంపెనీల్లో వాటాల అమ్మకం (డిజిన్వెస్ట్మెంట్) దాదాపుగా ఆగిపోయింది. ఫలితంగా -- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం మళ్లీ తప్పిపోయే అవకాశం ఉంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ), కాంకర్ వంటి కంపెనీల్లో ప్రైవేటీకరణ ప్రణాళికలు ఇప్పటికే వెనకబడ్డాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత మాత్రమే ప్రైవేటీకరణ జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 51,000 కోట్ల బడ్జెట్ మొత్తంలో దాదాపు 20 శాతం లేదా రూ. 10,049 కోట్లు ఐపీఓ, ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్), మైనారిటీ వాటా విక్రయాల ద్వారా వచ్చాయి. ఎస్సీఐ, ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్, బీఈఎంఎల్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్, ఐడీబీఐ బ్యాంక్లతో సహా పలు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈలు)లలో డిజిన్వెస్ట్మెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి కావాల్సి ఉంది. చాలా సీపీఎస్ఈలకు సంబంధించి కోర్ నాన్-కోర్ ఆస్తుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కానందున, ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించడంలో జాప్యం జరిగింది.
ఐడీబీఐ బ్యాంక్ విషయంలో, ప్రభుత్వం జనవరి 2023లో ఈఓఐ (ఆసక్తి వ్యక్తీకరణలు)లను తీసుకుంది. బిడ్డర్లకు ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి తగిన అనుమతులు రాలేదు. అందువల్ల లిస్టులోని అన్ని సీపీఎస్ఈల ప్రైవేటీకరణ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం దీపమ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) ద్వారా దాదాపు 11 లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ఏఐ అసెట్ హోల్డింగ్ లిమిటెడ్ (ఏఐఏహెచ్ఎల్) అనుబంధ సంస్థల కోసం ఇంకా ఈఓఐలను ఆహ్వానించలేదు.
తీవ్ర వ్యతిరేకత
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) లేదా వైజాగ్ స్టీల్ విక్రయంపై ఉద్యోగుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీని ప్రైవేటీకరణ ఇప్పటికీ సవాలుగా మిగిలిపోయింది. 2022లో నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు కట్టబెట్టారు. ఇదే ఊపుతో మరిన్ని సీపీఎస్ఈలను ప్రైవేటీకరించాలని భావించారు. అయితే, 2023లో వ్యూహాత్మక విక్రయాల విషయంలో పెద్దగా పురోగతి లేదు. రెగ్యులేటరీ పరమైన ఇబ్బందులు, ప్రపంచ ఆర్థిక అస్థిరత, కొన్ని రంగాలలో ప్రైవేటీకరణకు రాజకీయ వ్యతిరేకత, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ ప్రాధాన్యాలు మార్చడం వంటి అనేక కారణాల వల్ల పెట్టుబడుల ఉపసంహరణ నత్తనడకన సాగుతోందని శ్రీవాస్తవ అనే ఎక్స్పర్ట్ అన్నారు.
వైజాగ్స్టీల్తోపాటు బీఈఎంఎల్, ఎస్సీఐ వంటి వాటి ప్రైవేటీకరణకు కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎన్నికల సమయంలో కేంద్రం వీటి ప్రైవేటీకరణ జోలికి వెళ్లకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణల నుంచి గత 10 సంవత్సరాలలో సుమారు రూ. 4.20 లక్షల కోట్లు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.