ఎల్బీనగర్,వెలుగు: చిల్డ్రన్ పార్కు గేటులో ఓ బాలుడి తల ఇరుక్కుని విలవిల్లాడిపోయిన ఘటన ఐదు రోజుల కిందట జరగ్గా గురువారం ఆ వీడియో వైరల్గా మారింది. స్థానికుల తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో మంత్రాల చెరువు వద్ద ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కులో కొద్ది రోజులుగా పనులు జరుగుతుండగా అధికారులు గేట్లు మూసి వేశారు. అయితే.. మార్నింగ్ వాకర్స్ అడ్డంగా పెట్టిన జాలి తొలగించి వాకింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ మహిళ వాకింగ్ చేస్తుండగా..ఆమె కొడుకు(4) గేటు మధ్యలో నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో బాలుడి తల గేటు ఐరన్ గ్రిల్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఎంతకీ బయటకు రాకపోగా ఆ బాలుడు ఏడ్చాడు. ఇది చూసిన వాకర్స్ వచ్చి సేఫ్గా బాలుడి తలను బయటకు తీశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.