అమెరికా-చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ రిపోర్టు
పక్కా పథకం ప్రకారం చేశారని ఆధారాలూ ఉన్నాయన్న కమిషన్
గొడవకు ముందు రెచ్చగొట్టేలా మాట్లాడిన చైనా డిఫెన్స్ మినిస్టర్
వేరే దేశాలను బెదిరించేలా ప్రవర్తిస్తోందని నివేదిక
న్యూఢిల్లీ: ఇండియా, చైనా సైనికుల మధ్య లడాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన గొడవను చైనా సర్కారు పక్కా ప్లాన్ ప్రకారం చేసిందని అమెరికాకు చెందిన ఓ ఇంటెలిజెన్స్ కమిటీ వెల్లడించింది. తొలుత చైనా రెచ్చగొట్టే మాటలు, మే నెలలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి బార్డర్ గొడవలు, జూన్లో గల్వాన్ సంఘటన అంతా పథకం ప్రకారం జరిగాయని చెప్పింది. రెండు దేశాల ఎల్ఏసీ వెంబడి 8 నెలల పాటు కొనసాగిన ఇలాంటి ఘటన గత కొన్ని దశాబ్దాల్లో ఇంకొకటి జరగలేదని వివరించింది. గల్వాన్ గొడవకు సంబంధించి ముఖ్యమైన వివరాలతో కూడిన రిపోర్టును డిసెంబర్ 1న అమెరికా -చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ అక్కడి కాంగ్రెస్కు అందజేసింది. చైనా ప్లాన్ చేసి దాడి చేసిందనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని రిపోర్టులో వివరించింది.
గొడవకు ముందు చాలా జరిగింది..
ఎల్ఏసీ వెంబడి గొడవలు జరగడానికి కొన్ని వారాల ముందు చైనా డిఫెన్స్ మినిస్టర్ వెయ్ ఫెంఘే రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని రిపోర్టులో కమిషన్ వెల్లడించింది. స్థిరత్వం కోసం యుద్ధం చేయాలనేలా ఆయన మాట్లాడారని చెప్పింది. చైనా సర్కారు అధీనంలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక గల్వాన్ లోయ విషయంలో ఇండియాను హెచ్చరిస్తూ తన ఎడిటోరియల్లో ఓ కథనం రాసుకొచ్చిందని వివరించింది. అమెరికా-, చైనా గొడవలో ఇండియా జోక్యం చేసుకుంటే గట్టి ఎదురుదెబ్బ తప్పదని.. చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించిందని చెప్పింది. గొడవకు వారం ముందు గల్వాన్ లోయలోకి వెయ్యిమంది వరకు చైనా సైనికులు చేరుకున్నట్టు శాటిలైట్ ఆధారాలు కూడా ఉన్నాయంది. వీటన్నింటినీ చూస్తే ప్లాన్ ప్రకారమే డ్రాగన్ కంట్రీ దాడికి దిగినట్టు అర్థమవుతోందని కమిషన్ వెల్లడించింది.
ఇంకిన్ని దేశాలతోనూ ఇట్లనే లొల్లులు
ఇండియాతో గొడవలతో పాటు తైవాన్, హాంకాంగ్ దేశాలకు వ్యతిరేకంగా చైనా తీసుకుంటున్న చర్యలు, ఆఫ్రికాలో చైనా వ్యూహాత్మక విధానాలను కూడా రిపోర్టులో కమిషన్ ప్రస్తావించింది. ‘హాంకాంగ్లో క్రూరమైన నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని ఈ ఏడాది చైనా తీసుకొచ్చింది. ఇదే కాదు.. 2020లో ఆ దేశం ఇంకా చాలా చేసింది. తైవాన్ను బెదిరించడానికి మిలటరీ విన్యాసాలు చేసింది. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్తో పాటు చాలా దేశాలపై ఒత్తిడి పెంచుతూ ప్రతిష్ట దిగజార్చుకుంటోంది’ అని కమిషన్ వివరించింది.
సముద్రంలోనూ గట్టిగ జవాబిచ్చినం: వైస్ అడ్మిరల్
కొచ్చి: ఇండియా చైనా మధ్య బార్డర్ గొడవలు జరుగుతున్న టైమ్లో చైనా నేవీని మన నేవీ సమర్థంగా నిలువరించిందని వైస్ అడ్మిరల్ ఏకే చావ్లా చెప్పారు. భూమిపైనే కాదు సముద్రంలోనూ ఇండియాతో గొడవకు దిగితే అదే స్థాయిలో జవాబిస్తామని చైనాకు ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు.
1975 తర్వాత ఇదే పెద్ద గొడవ
1975 తర్వాత ఇండియా, చైనా మధ్య జరిగిన గొడవల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం మళ్లీ గల్వాన్ ఘటనలోనే జరిగింది. ఎల్ఏసీ వెంబడి ఈ ఏడాది మే నెలలో రెండు దేశాల మధ్య గొడవ లు మొదలయ్యాయి. అవి పెద్దవై జూన్ 15న గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు తీవ్రంగా గొడవ పడే స్థాయికి చేరాయి. ఆ గొడవలో 20 మంది ఇండియన్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా చైనా వైపు కూడా చాలా మందే మర ణించారు. గొడవలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు 2 దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మిలటరీ స్థాయిలో 8 రౌండ్లు చర్చలు జరిగాయి.
జిన్పింగ్ వచ్చాక ఎక్కువైనయ్
కొన్ని దశాబ్దాలుగా చైనా, ఇండియా మధ్య ఎల్ఏసీ వెంబడి గొడవలు జరుగుతున్నాయని రిపోర్టులో ప్రస్తావించిన కమిషన్.. 2012లో జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి గొడవలు ఐదు సార్లు పెద్ద స్థాయిలో జరిగాయని వివరించింది. చైనా రెచ్చగొట్టే ప్రవర్తన వెనుక అసలు ఉద్దేశమేంటో స్పష్టంగా తెలియట్లేదంది. ఎల్ఏసీ వెంబడి ఇండియా రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించకుండా చేయడమో లేక అమెరికా వైపు నిలబడకుండా హెచ్చరించడమో చైనా దాడుల వెనకున్న ఉద్దేశమైతే అది సక్సెస్ కాదని కమిషన్ వివరించింది.