టీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ ఫ్లెక్సీల చించివేత

టీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ ఫ్లెక్సీల చించివేత

అధికార పార్టీ టిఆర్ఎస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన జలగం వెంకట్రావు అభిమానులు సీఎం కేసీఆర్, కేటీఆర్ , పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావుల ఫోటోలతో  ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనుచరులు చించేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఫ్లెక్సీల తొలగింపుపై  సమాచారం అందుకున్న జలగం వెంకట్రావు అభిమానులు.. ఎమ్మెల్యే వనమా పై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నుండి టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం, అభ్యర్థుల గెలుపు కోసం పని చేశామని కానీ ఇతర పార్టీ నుంచి వచ్చి వచ్చిన ఎమ్మెల్యే వనమా అతని కుమారుడు రాఘవేంద్ర రావు అనుచరులు తమని పట్టించుకోవడం లేదని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సుజాత నగర్ పర్యటన సందర్భంగా తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని జలగం వెంకట్రావు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.