
హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై ప్రధాని మోడీ కామెంట్లు చేసినా ఎందుకు ఖండించడం లేదని సీఎం కేసీఆర్ ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. హరీశ్ రావు లాంటి నేతలతో మాట్లాడిపించడం మాని, ఇప్పటికైనా నోరు తెరవాలన్నారు. తెలంగాణపై కేసీఆర్ కు ఏమాత్రం గౌరవం ఉన్నా.. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ధన్యవాదాలు చెప్పి, కామెంట్లు చేసిన మోడీకి కౌంటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై అక్కసుతోనే మోడీ కామెంట్లు చేశారని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లును కాంగ్రెస్ప్రజాస్వామ్య పద్ధతిలోనే పాస్ చేసిందన్నారు. ఆ టైమ్ లో కేసీఆర్ పార్లమెంట్ లో లేరని, కాంగ్రెస్కు బలం సరిపోకపోతే భాగస్వామ్య పార్టీలను ఒప్పించి మరీ సోనియా తన మాట నిలుపుకున్నారని చెప్పారు. బిల్లు పాస్ చేసేటప్పుడు తలుపులు మూసేస్తారని, అవన్నీ తెలిసే మోడీ అలా మాట్లాడడం బాధాకరమన్నారు. ప్రధాని దేశాన్ని రెండుగా విభజించి పాలిస్తున్నారని.. నార్త్, సౌత్ అనే తేడా తెచ్చారని ఆరోపించారు. మోడీ కుట్రపూరితంగానే తెలంగాణపై కామెంట్లు చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని పనులన్నీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయినా విభజన సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
బీజేపీ, టీఆర్ఎస్ వి నాటకాలు: మధుయాష్కీ
బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు. ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడకుండా, అనవసర విషయాలు చర్చకు తేవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. మోడీకి దమ్ముంటే కేసీఆర్పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మోడీ విభజన హామీలపై మాట్లాడకుండా, విభజన తీరును తప్పుపట్టడం సిగ్గుచేటని పీఏసీ చైర్మన్షబ్బీర్ అలీ అన్నారు. బీజేపీ ఎంపీలకు సిగ్గూశరం ఉంటే మోడీతో క్షమాపణలు చెప్పించాలన్నారు. తెలంగాణకు బీజేపీ మద్దతు ఇచ్చిన విషయాన్ని మోడీ మరిచిపోయారని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు.