హైదరాబాద్, వెలుగు: సీఏఏను నూటికి నూరు శాతం వ్యతిరేకిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అవసరమనుకుంటే తానే లీడ్ తీసుకొని దేశం కోసం బయల్దేరుతానని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ మంచిగనే ఉంది. పిల్లలైతే మంచిగనే పని చేస్తున్నరు. పోవాల్సివస్తే కేసీఆర్ దేశం కోసం బైలెల్లుతడు’’ అంటూ త్వరలో తన పిల్లలకు సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదని చెప్పకనే చెప్పారు. త్వరలో కేటీఆర్కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చేసిన కామెంట్లు ఆసక్తి రేపాయి. అనంతరం ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావిస్తే సీఎం నవ్వులు రువ్వించారు. కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతారని విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘‘ఎవరూ ఎప్పుడు సీఎం అవుతారనేది సమయం, సందర్భం వచ్చినప్పుడు తేలుతుంది. నరేంద్ర మోడీ సీఎంగా ఉండి ప్రైం మినిష్టర్ కాలేదా. ఇక్కడ్నించి పోయాక, ఖాళీ అయ్యాకచూద్దాం. ఎవరు కావాలో, ఎవరు కావద్దో.. సమయం, సందర్భం వచ్చినప్పుడు తేలుతుంది. విష్ పుల్ థింకింగ్ లో అనుకోవచ్చు. చాలా మంది కోరుకుంటారు..’’ అని బదులిచ్చారు. దీనిపై అసెంబ్లీలోనే ఇప్పటికే చెప్పానని తెలిపారు. ‘‘ఈ మధ్య హాస్పిటల్కు పోతే .. 30, 40 బ్లడ్ టెస్టులు చేసిండ్రు. ఫర్ఫెక్ట్ఆల్రైట్ గా ఉన్నావని డాక్టర్లు చెప్పిండ్రు. దుక్కలాగున్న. నేను నచ్చుతలేనా ఏందీ..? నన్ను జబర్దస్తీగా పంపిస్తారా.. ఏందీ..’’ అంటూ నవ్వారు.