నాకే దిక్కులేదు.. ఇంకా ప్రజలు ఎక్కడికి పోతరు

నాకే దిక్కులేదు.. ఇంకా ప్రజలు ఎక్కడికి పోతరు

సీఏఏ, ఎన్‌పీఆర్ వ్యవహారాలు భారతదేశ గౌరవానికి చెందిన అంశాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం శాసనసభలో అన్నారు. మిగతా రాష్ట్రాల్లానే తెలంగాణ అసెంబ్లీలో కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని అన్నారు. ఎన్‌పీఆర్ అమలు విషయంలో తమ పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారని, తనకు కూడా ఈ సమస్య ఎదురవుతుందని వ్యాఖ్యానించారు.

శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘నేను మా ఊళ్లో సొంతింట్లో పుట్టాను. అప్పుడు దవాఖానాలు లేవు. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. నువ్వెవరు?  అంటే ఏం చెప్పాలి? హౌ డూ ఐ ప్రూఫ్?  ఆ కాలంలో పెద్దలు ఊళ్లో ఉన్న అయ్యగారిని పిలిపించి ‘జన్మనామం’ అని రాయించేవాళ్లు. అదే బర్త్ సర్టిఫికెట్. దానికి అఫిషియల్ ముద్ర ఉండదు. ఇప్పటికి కూడా నా జన్మనామం నా దగ్గర ఉంది. మా వైఫ్ దగ్గర ఉంది. ఆ రోజున ఆసుపత్రులు, ఈ రికార్డులు లేవు. నాదే దిక్కులేదంటే, ‘మీ నాయనది తీసుకురమ్మంటే’ నేను చావాలనా? మాకు 580 ఎకరాల జాగా, పెద్ద బిల్డింగ్ ఉంది. అలాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్ సర్టిఫికెట్ లేకపోతే దళితులకు, నిరుపేద ప్రజలకు ఎక్కడిది? వివరాలు తెమ్మంటే యాడ తేవాలి?’ అని ప్రశ్నించారు. దీనికి బదులు నేషనల్ ఐడెంటి కార్డు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.