హైదరాబాద్:
తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఉన్నతాధికారుల కమిటీతో రెండో దఫా చర్చలు జరుపుతున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజు, దాన కిషోర్ , ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి అధికారుల కమిటీ, RTC ఉద్యోగులు లేవనెత్తిన 32 అంశాలపై పరిశీస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ప్రధాన డిమాండ్ గా జేఏసీ నేతలు చర్చిస్తున్నారు.28 అంశాలపై సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. మంత్రులతో భేటీ ముగిసిన తర్వాత సమ్మె విరమణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
చర్చల్లో.. మృతిచెందిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరపునుంచి కూడా పరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు కమిటీని కోరారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం తరపున రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది.. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో అన్ని డిపోల దగ్గర కార్మికులు ఆందోళనలు,ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్, ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది ప్రభుత్వం.. కాంట్రాక్టు పద్దతిన డ్రైవర్లు, కండక్టర్లను నియమించి బస్సులను నడుపుతోంది.

