కరోనా చీకట్లను చీల్చుకుంటూ దీపాలు ప్రజ్వలితమయ్యాయి. దేశమంతా దివ్యజోతులు వెలిగాయి. ప్రమిదలు.. కొవ్వుత్తలు.. టార్చ్లైట్లు.. మొబైల్ లైట్ల రూపంలో.. 130 కోట్ల మంది మహాసంకల్పంతో ఆశాదీపాలను వెలిగించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపుమేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కొవ్వొత్తి వెలిగించారు. కొవ్వత్తి పట్టుకుని కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించారు.
ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణరావు, శాంత కుమారి, అడ్వకేట్ జనరల్ పి.ఎస్. ప్రసాద్ , అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.