రైతులు ఏ పంటలు వేస్తే లాభమో చెప్పండి

రైతులు ఏ పంటలు వేస్తే లాభమో చెప్పండి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్టు, మార్కెట్ లో డిమాండ్ కలిగిన పంటలను సాగు చేసేటట్టు రైతులకు గైడ్ లైన్స్  ఇవ్వాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేస్తే రైతులకు లాభమో స్టడీ చేసి మే 5లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రం లో కొత్త అగ్రికల్చర్ పాలసీ రూపకల్పనపై సీఎం కేసీఆర్ వరుసగా రెండో రోజు బుధవారం కూడా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో గతంలో ప్రాజెక్టులు, కరెంటు సరిగా లేకపోవడం వల్లసాగునీటి లభ్యత అంతగా లేదు. ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో రైతులు ఎవరికి తోచినట్లువాళ్లు వనరులకు తగ్గట్టు పంటసాగు చేశారు. ఇప్పుడు పరిస్థితి మారుతున్నది. ప్రతి మూలకూ సాగునీరు అందుతున్నది. కాబట్టి రైతులకు సరిగ్గా గైడ్ లైన్స్ ఇస్తే లాభదాయక వ్యవసాయం చేస్తారు. పంటల ఎంపికలో, సాగు పద్ధతుల్లో, ఎరువుల వాడకంలో, మార్కెటింగ్లో మార్పులు వస్తాయి. ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ పాలసీ రావాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. వరిలో సన్న రకాలపై దృష్టిపెట్టాలి పంటకాలం తక్కువనే కారణంతో దొడ్డు రకా లవైపే రైతులు ఎక్కువ దృష్టి పెడుతున్నారని,

కానీ ఎక్కువ మంది జనం సన్నరకాలు తింటు న్నారని, సన్నరకాలకు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందని సీఎం చెప్పారు. ఇప్పుడు సాగునీటి వసతి కూడా ఉంది కాబట్టి ఎక్కువగా సన్నరకాలు పండించే విధంగా రైతులను చైతన్య పరచాలని అధికారులకు ఆయన సూచించారు. ‘‘రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలి. అట్లయితేనే అన్ని పంటలకు డిమాండ్ వస్తుంది. తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడి, మార్కెట్ అవకాశాలు, మంచి ఆదాయం పొందగలిగే పంటలను గుర్తించి రైతులకు సూచించాలి. ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయించి సాగు చేయించాలి” అని అన్నారు.

డిమాండ్ ఉన్న పంటలు గుర్తించాలి

వేరుశెనగ, కందులు, పామాయిల్ లాంటి వాటికి మార్కెట్లో డిమాండ్ ఉందని, ఇంకా ఇలాంటి డిమాండ్ కలిగిన పంటలను గుర్తించాలని, వాటిని ఎన్నిఎకరాల్లో పండించవచ్చో తేల్చాలని అధి కారులను ఆదేశించారు. రాష్ట్రంలో కూరగాయలు, పండ్లకు కూడా కొరత ఉందని, అవి ఎంతవరకు పండించాలనే విషయంపై కూడా స్టడీ జరగాలన్నారు. నీటి వసతి పెరిగినందున ఫిష్ కల్చర్ ను కూడా రాష్ట్రంలో విస్తరించవచ్చా? అనే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు. ఎరువుల వాడకం ఇప్పటిలాగానే ఉండాలా? ఏమైనా మార్పులు అవసరమా? అనే విషయాలను కూడా పరిశీలించా లన్నారు. వీటన్నింటిపై పూర్తిస్థాయిలో స్ట డీ చేసి మే 5లోగా రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గోదాములు నిర్మించాలని  నిర్ణయించి  నందున వెంటనే స్థలాలను గుర్తించాలన్నారు. కొత్తగా నిర్మించే గోదాముల్లో కోల్ట్ స్టోరేజ్  సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.