సంక్రాంతి కల్లా అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు

సంక్రాంతి కల్లా అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు

తెలంగాణ రైతాంగం విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి  ‘రైతుబంధు’ నిధులను విడుదల చేయనున్నట్లు సీఎంఓ నుంచి ప్రకటన విడుదలైంది. డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నిధులను విడుదల చేయడం ప్రారంభించాలని మంత్రి హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటిలాగే ఒక ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ముందుగా నిధులు జమ కానున్నాయి. తర్వాత ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. సంక్రాంతి కల్లా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని సీఎంఓ తెలిపింది. ఇందుకోసం రైతుల ఖాతాల్లో రూ.7,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. 

రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందిస్తోంది. ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్తుతో పాటు, రైతు బీమాతో పాటు, పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడిని అందిస్తోంది. దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రభావితం చేస్తున్నాయని సీఎంఓ తెలిపింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ.. తెలంగాణ రైతులు, ప్రజలను కష్టాల పాలు చేయాలని కేంద్రం చూస్తోందని సీఎంఓ ఆరోపించింది. కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, రైతుల సంక్షేమం విషయంలో  ప్రభుత్వం రాజీ పడకుండా నిధులను విడుదల చేస్తోందని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.