కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్లో తండ్రి చేతిలో హత్యకు గురైన చిన్నారులకు కుటుంబ సభ్యులు ఐదవ రోజున పిండాలు పెట్టారు. అయితే.. ఆ పిండాలు తినడానికి కాకులకు బదులు రెండు శునకాలు రావడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ శునకాలకే పిండాలను తినిపించారు. ఆ సమయంలో చిన్నారుల కన్న తల్లి పిల్లలను పూడ్చి పెట్టిన మట్టిపై పడి గుండెలవిసేలా రోదించింది.
ఆ కన్న తల్లి రోదనలకు అక్కడకు వెళ్లిన వారి గుండెలు దు:ఖంతో బరువెక్కాయి. కన్నీళ్లతో చనిపోయిన చిన్నారులు ఇద్దరికీ నివాళి అర్పించారు. ఆడ పిల్లలు పుట్టడం ఇష్టం లేని ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులకు గడ్డి మందు తాగించి, బావిలోకి తోసిన తర్వాత తానూ దూకేశాడు. ఇద్దరు చిన్నారులు చనిపోగా తండ్రి సేఫ్గా బయటపడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో ఏప్రిల్ 3, 2026న జరిగింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలానికి మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన చుక్క రాజమల్లు కుమార్తె మౌనికతో ఆరేండ్ల కింద వివాహమైంది. వీరికి కవల కూతుళ్లు గీతాంశీ, గీతాన్విక (4) ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారంటూ శ్రీశైలం తరుచూ భార్య మౌనికతో గొడవ పడుతుండేవాడు. ఈ విషయంలో శ్రీశైలంను బంధువులు, పెద్దమనుషులు పలుమార్లు మందలించారు. అయినా అతడిలో మార్పు రాలేదు.
ALSO READ : రూ.14 లక్షలు అప్పు ఇచ్చిన పాపానికి..
ఈ క్రమంలో శుక్రవారం కూడా భార్యతో మరోసారి గొడవపడ్డాడు. ఆ తర్వాత చిన్నారిలిద్దరినీ పొలం వద్దకు తీసుకెళ్లి గడ్డి మందు తాగించిన అనంతరం బావిలో పడేశాడు. తర్వాత తాను కూడా బావిలో దూకాడు. కానీ అతడికి ఈత రావడంతో సేఫ్గా ఒడ్డుకు చేరాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, గజఈతగాళ్లు ఘటనాస్థలానికి చేరుకొని బావిలో గాలించగా గీతాంశీ డెడ్బాడీ దొరికింది. కొన్ని గంటల తర్వాత గీతాన్విక మృతదేహం కూడా లభ్యమైంది. గ్రామస్తులు శ్రీశైలానికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
