ప్రతి ఏటా హైదరాబాద్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు : సీఎం రేవంత్

ప్రతి ఏటా  హైదరాబాద్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్  ఫాలో అప్ సదస్సు : సీఎం రేవంత్

 ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని  సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

 ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార–వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని  రేవంత్ అన్నారు. అందుకే ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రతినిధులకు సూచించారు.

 హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, 5.75 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రతి ఏడాది మేము ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తాం. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చాం, అని తెలిపారు.

హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (GCCs) ప్రధాన కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడుతామని చెప్పారు. దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.
 భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH), తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030ను ఆవిష్కరించారు.

ఈ  సమావేశంలో పాల్గొన్న మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు–కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన క్యూర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. తెలంగాణలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సాంకేతికత, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం స్వీకరిస్తామని తెలిపారు.