బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డేపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేటీఆర్ దావత్ ఇస్తానంటే తప్పకుండా విష్ చేస్తానని వ్యాఖ్యానించారు. అంతేకాదు... దావత్ ఇచ్చినా అనుమానమే, అందులో ఏం కలుపుతారో ఏమో అంటూ పంచ్లు వేశారు.
రాష్ట్రంలో శాంతియుత ధర్నాలకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎత్తేసిన ధర్నా చౌక్ను తమ ప్రభుత్వమే పునరుద్ధరించిందని గుర్తుచేశారు. ఆక్రమణల నుండి హైడ్రా ద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని చెప్పారు. హైదరాబాద్లో ప్రస్తుతం నీటి కష్టాలు లేవని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో NDSA నివేదిక ప్రకారమే ముందుకెళ్తామని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో లక్ష మెజారిటీ ఉందంటున్న హరీష్ రావు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలిచిందో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. అలాగే గ్లోబరీనా ఇష్యూలో కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఓట్లే టార్గెట్గా ఓట్ల తొలగింపు జరుగుతోందని సీఎం ఆరోపించారు. స్థానికంగా లేని తండాల ప్రజల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులదేనని పిలుపునిచ్చారు. BLOల కంటే BLAలే ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించాలని సూచించారు. తనపై రెండు ఓట్లు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు.
ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకంపై స్పందిస్తూ... సొంత స్థలం ఉన్నవారికి పాలసీ ప్రకారం ఇల్లు కట్టిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు తాము ఉన్న నియోజకవర్గంలోనే అప్లై చేసుకోవాలని, స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
