తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..పరేడ్ ​గ్రౌండ్​లో జెండా ఎగరేయనున్న సీఎం రేవంత్​

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..పరేడ్ ​గ్రౌండ్​లో జెండా ఎగరేయనున్న సీఎం రేవంత్​

 

  • పరేడ్ ​గ్రౌండ్​లో జెండా ఎగరేయనున్న సీఎం రేవంత్​
  • ప్రత్యేక అతిథిగా జపాన్​లోని కితాక్యూషూ సిటీ మేయర్ 
  • ప్రజలకు సీఎం రేవంత్​ శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ సిద్ధమైంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర సర్కారు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్​లో సీఎం రేవంత్​ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగించనున్నారు.  ఈసారి వేడుకలకు ప్రత్యేక అతిథులుగా జపాన్​ లోని  కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ  ప్రతినిధి బృందం హాజరుకానున్నది. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి జపాన్​ పర్యటనలో భాగంగా  కితాక్యుషూ సిటీని సందర్శించారు.  హైదరాబాద్​కు రావాలని ఆ సిటీ మేయర్ ను ఆహ్వానించారు. ఇక జిల్లాల్లో ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్​లు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 

రాష్ట్ర ప్రజలకు సీఎం విషెస్​

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం..  పదకొండేళ్లు పూర్తిచేసుకొని పన్నెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నదని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన  అమరుల త్యాగాలను సీఎం రేవంత్​రెడ్డి స్మరించుకున్నారు. ఏండ్లపాటు సాగిన  తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల  నాయకులందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి  తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు.  అన్ని రంగాల్లో  రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.