
- గాంధీ భవన్లో నిరసనలు, ఆందోళనలపై సీఎం రేవంత్ సీరియస్
- జూబ్లీహిల్స్ అభ్యర్థిపై ఎవరూ మాట్లాడవద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 99 శాతం సీట్లు గెలిచే బాధ్యత ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులదేనని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ స్పెషల్ టాస్క్పై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గంలో పదవులు పొందిన వారి పనితీరుపై ఇప్పటి నుంచి రెండు జాబితాలు తయారు చేయాలని పీఏసీ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పనిచేసే వాళ్లను ఒక జాబితాలో, పనిచేయని వాళ్లను మరో జాబితాలో చేర్చాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సీఎం రేవంత్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పనిచేస్తేనే ప్రమోషన్.. లేదంటే డిమోషన్ చేయాలని ఇందులో నిర్ణయించారు.
ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో అవసరమైతే తాను కూడా ప్రచారం చేస్తానని.. కానీ, ఎలాగైనా సరే ఈ ఎన్నికలను పార్టీ నేతలు సీరియస్గా తీసుకొని క్లీన్స్వీప్ చేయాలని సీఎం కోరినట్లు తెలిసింది. ఇన్చార్జి మంత్రులతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్చార్జీలుగా ఉన్న వారు కూడా ఈ ఎన్నికల బాధ్యతలు తీసుకొని, పనిచేయాలని సూచించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా ఆషామాషీగా తీసుకోవద్దని, ఈ సీటును ఎలాగైనా సరే కాంగ్రెస్ గెలుచుకోవాలని సీఎం రేవంత్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నట్లు సమాచారం.
గాంధీ భవన్లో నిరసనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలిసింది. మరోసారి ఎవరైనా సరే గాంధీ భవన్లో నిరసనలు, ఆందోళనలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ను సీఎం కోరినట్లు సమాచారం. అలాగే, జూబ్లీహిల్స్ నియోజకవర్గఅభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లు తెలిసింది.అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడవద్దని ఆయన ఆదేశించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది.