విద్యార్థినిపై కాలేజీ చైర్మన్‌ లైంగిక వేధింపులు .. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ల ఆందోళన

విద్యార్థినిపై కాలేజీ చైర్మన్‌ లైంగిక వేధింపులు .. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ల ఆందోళన

హసన్ పర్తి, వెలుగు : హాస్టల్  విద్యార్థినిపై ఓ కాలేజీ చైర్మన్  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  ఈ సంఘటన హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం భీమారంలో శనివారం కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లాకు చెందిన బాధితురాలు శ్రీచైతన్య కాలేజీలో  ఇంటర్​ సెకండియర్  చదువుతోంది. శుక్రవారం అర్ధరాత్రి కాలేజీ చైర్మన్  బూర సురేందర్  గౌడ్.. హాస్టల్ లో ఉన్న ఆ విద్యార్థిని తల్లిదండ్రులు వచ్చారని, కిందికి రావాలన్నాడు.

విద్యార్థిని కిందికి వచ్చి చూడగా తన తల్లిదండ్రులు లేరు. దీంతో ఆమెను సురేందర్ గౌడ్  తన చాంబర్ లోకి రమన్నాడు. తన కోరికలు తీర్చాలంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను కొట్టి బెదిరించాడు. బాధితురాలు అక్కడి నుంచి పారిపోయి తోటి హాస్టల్  విద్యార్థులకు జరిగిన ఘటన గురించి తెలిపింది. దీంతో వారు తమ తల్లిదండ్రులకు ఫోన్ లో సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం ఆ విద్యార్థిని  తల్లిదండ్రులు కళాశాల వద్దకు  చేరుకొని ఆందోళన చేశారు.

చైర్మన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. విషయం తెలుసుకున్న కాకతీయ యూనివర్సిటీ గిరిజన విద్యార్థి సంఘాలు, టీజీవీపీ నాయకులు అక్కడికి చేరుకొని స్టూడెంట్లతో కలిసి ధర్నా నిర్వహించారు. హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, కాకతీయ వర్సిటీ ఎస్సై సురేశ్   ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సురేందర్  గౌడ్ పై కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు.