రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం

రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం

టికెట్ లేని ప్రయాణం, ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకోలేదని రైల్వే టీసీలు ప్రయాణికులకు జరిమానాలు విధిస్తారు. మరి రైలు రావాల్సిన సమయానికి రాకుండా, గంటలకు గంటలు ఆలస్యమైతే …ప్రయాణికులు ఓపికగా ఎదురుచూడాలి. ఇకపై సకాలంలో రైలు రాకపోతే …ఆ రైలు కోసం ఎదురు చూసే ప్రయాణికులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది భారత రైల్వేశాఖ.

ఢిల్లీ-లక్నో మధ్య  కొత్తగా ప్రారంభం కానున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి రైలు ఆలస్యమైతే పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. రైలు గంట ఆలస్యమైతే ప్రయాణికులకు రూ.100 రూపాయలు, 2 గంటలు ఆపైన ఆలస్యానికి రూ.250 చొప్పున పరిహారం ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోన్న ఈ రైలు దేశంలోనే తొలి ప్రైవేట్‌ ఆపరేటర్‌ ద్వారా నడుస్తోంది.  ఈ రైలును లక్నో నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అక్టోబర్‌ 14న పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

అంతేకాదు.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు రూ.25 లక్షల ప్రయాణ బీమా సౌకర్యాన్ని కూడా ఐఆర్‌సీటీసీ అందించనుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికుల వస్తువులు చోరీకి గురైనా, దోపిడీ జరిగినా ఇదే ప్రయాణ బీమా ద్వారా రూ.లక్ష వరకు పరిహారమిచ్చే అవకాశం కూడా ఉంది.