న్యూఢిల్లీ: పార్లమెంట్ మకర ద్వారం వద్ద అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు. గురువారం పార్లమెంట్ ముగిసిన తర్వాత ఇరువర్గాలు పోటాపోటీగా నిరసనలు, నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు సెక్యూరిటీ సిబ్బంది రెండు వర్గాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేసి కాపలా కాశారు. ఢిల్లీలో స్టూడెంట్లు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు చేసిన లాఠీ చార్జ్కు బాధ్యత వహించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ‘‘అమిత్ షా మాఫీ మాంగో’’ అని నినాదాలు చేశారు.
అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపైనా నిరసన వ్యక్తం చేశారు. విరాళాలు దోచుకున్నదెవరు అని రాసిన ప్లకార్డులు, బ్యానర్ను ప్రదర్శించారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు ఎన్డీఏ ఎంపీలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని తాము చెప్పినాగానీ, రాహుల్ గాంధీనే తప్పించుకుంటున్నారని ఆరోపించారు. మకర్ ద్వారం మెట్లపై కూర్చొని రాహుల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
