కొత్త లెక్చరర్లకు ట్రైనింగ్ ఏదీ .. మార్చిలో జూనియర్ కాలేజీలకు 1,200 మంది కొత్త లెక్చరర్లు

కొత్త లెక్చరర్లకు ట్రైనింగ్ ఏదీ .. మార్చిలో జూనియర్ కాలేజీలకు 1,200 మంది కొత్త లెక్చరర్లు
  • పీజీ క్వాలిఫికేషన్‌తోనే ఉద్యోగంలోకి వచ్చిన అభ్యర్థులు 
  • టీచింగ్ స్కిల్స్ నేర్పని ఇంటర్ విద్య అధికారులు

హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీలకు వచ్చిన కొత్త లెక్చరర్లపై ఇంటర్మీడియెట్అధికారుల నిర్లక్ష్యం కన్పిస్తున్నది. వారికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే స్టూడెంట్లకు పాఠాలు చెప్పించేందుకు సిద్ధమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, సర్కారు కాలేజీలకు టీజీపీఎస్సీ ద్వారా కొత్తగా 1,200 మంది జూనియర్ లెక్చరర్లు వచ్చారు. మార్చి నెలలో ఇంటర్ కమిషనరేట్ అధికారులు వారికి వివిధ కాలేజీల్లో పోస్టింగులు ఇచ్చారు. 

కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ కావడంతో, అప్పటికే ప్రారంభమైన ఇంటర్ స్పాట్ వాల్యువేషన్ లో వారి సేవలను అధికారులు వినియోగించుకున్నారు. కాగా, జూన్1 నుంచి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త లెక్చరర్లు వారికి క్లాసులు బోధించనున్నారు. అయితే, ఏ డిపార్ట్ మెంట్ లో అయినా కొత్తగా వచ్చిన ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ఆనవాయితీ. ఇంటర్మీడియేట్ కమిషనరేట్ మాత్రం ఇందుకు మినహాయింపుగా మారింది. అయితే, విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు, వారిలోని ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంపొందించడంలో లెక్చరర్లపై కీలక బాధ్యత ఉంటుంది. అయితే, కొత్తగా నియమితులైన లెక్చరర్లకు బోధనా నైపుణ్యాలు, క్లాస్‌‌‌‌రూమ్ మేనేజ్‌‌‌‌మెంట్, విద్యార్థులతో మాట్లాడే విధానంపై శిక్షణ లేకపోవడంతో.. బోధనా తీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

టీచర్లకు ఇచ్చి.. లెక్చరర్లను మరిచి 

గతేడాది అక్టోబర్‌‌లో 10వేలకు పైగా కొత్త టీచర్లు స్కూళ్లకు వచ్చారు. వీరంతా డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తి చేసిన తర్వాతే.. ఈ టీచర్ కొలువులు సాధించారు. వీరికి మొదట్లోనే మూడు రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. దాంతో పాటు మూడుసార్లు బోధన మెలకువలు నేర్పించారు. తాజాగా కొత్త, పాత టీచర్లందరికీ ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ, పీజీ క్వాలిఫికేషన్ తో ఉద్యోగంలోకి వచ్చిన కొత్త లెక్చరర్లకు మాత్రం ఇంటర్మీడియేట్ అధికారులు ఇప్పటికీ ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. చాలామంది టీచర్ ట్రైనింగ్ కోర్సులూ చేయలేదు. వారందరికీ పాఠాలు ఎలా చెప్పాలనే దానిపై అవగాహన కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను పర్యవేక్షిస్తున్న సెక్రటేరియేట్​లోని విద్యాశాఖ ఉన్నతాధికారులు కేవలం స్కూల్ టీచర్లనే పట్టించుకోవడం, ఇంటర్ కాలేజీలపై వారి పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిపిస్తున్నది.