జీపీవో పోస్టులపై గందరగోళం.. నిరుద్యోగుల్లో ఆందోళన..

జీపీవో పోస్టులపై గందరగోళం.. నిరుద్యోగుల్లో ఆందోళన..
  • పాత వీఆర్వో, వీఆర్ఏల నుంచి రాతపరీక్ష ద్వారా 3,550 మంది ఎంపిక 
  • మిగిలిన మరో 7,404 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ చేయాలని గతంలో ప్రతిపాదనలు 
  • కానీ, ఇప్పుడు రెవెన్యూ నుంచే సర్దుబాటు చేయాలని ఆయా సంఘాల ఒత్తిడి

హైదరాబాద్, వెలుగు: కొత్తగా మంజూరు చేసిన గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టుల భర్తీపై గందరగోళం నెలకొంది. మొత్తం 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. పాత వీఆర్వో, వీఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా ఇప్పటికే 3,550 మందిని ఎంపిక చేశారు. మిగిలిన 7,404 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ఇప్పుడు రెవెన్యూ శాఖ నుంచే సర్దుబాటు చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 

అసలు మిగిలిన పోస్టుల భర్తీ ఎలా జరుగుతుందన్న దానిపై స్పష్టత కొరవడింది. జూన్ 2 నుంచి 35% గ్రామాల్లో మాత్రమే జీపీవోల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 65% గ్రామాలకు జీపీవోలు అందుబాటులో ఉండరు. దీంతో వాళ్లను ఎలా సర్దుబాటు చేస్తారో అనే ఆసక్తి నెలకొంది. వాస్తవానికి  గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రామ పాలనాధికారి పోస్టులను క్రియేట్​ చేసింది. మొత్తం 10,954 పోస్టులు అవసరమని అంచనా వేయగా, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. 

మారిన రెవెన్యూ ఉద్యోగుల స్వరం..

గ్రామ పాలనాధికారి పోస్టుల్లో సగం పోస్టులను డైరెక్ట్​ రిక్రూట్‌‌‌‌మెంట్ పద్ధతిలో చేపట్టి.. మిగిలిన సగం పోస్టులకు వివిధ శాఖల్లో అడ్జస్ట్​ చేసిన పాత వీఆర్ఓ, వీఆర్ఏలను తీసుకువాలని మొదట్లో సర్కారు భావించింది.  మధ్యలో సర్వీస్​ విషయంలో వ్యతిరేకత రావడంతో మొత్తం పోస్టులను డైరెక్ట్​ రిక్రూట్‌‌‌‌మెంట్​ద్వారానే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.  ఆలోగా పాత వీఆర్ఓలు, వీఆర్ఏలలో అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకోగా కేవలం 4,558 మందే అప్లై చేసుకున్నారు. ఇందులో పరీక్షకు 4 వేల మంది మాత్రమే అటెండ్​ కాగా.. అందులోనూ 3,550 మంది ఎంపిక అయ్యారు. 

ఇప్పుడు మిగిలిన పోస్టుల సంగతి ఏమిటనే ఆందోళన కొనసాగుతోంది.  టీజీపీఎస్సీ నుంచి  నోటిఫికేషన్​ వస్తుందని.. 7 వేలకు పైగా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్ పద్ధతిలోనే చేపడ్తామని ఉన్నతాధికారులు ఇప్పటివరకు చెప్తూ వచ్చారు.  అయితే, రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మాత్రం.. రెవెన్యూ శాఖ నుంచే మిగిలిన పోస్టులనూ భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. పైగా పరీక్షకు హాజరుకానివాళ్లకు, రాసి ఫెయిల్ అయినోళ్లకు, ఇతర రెవెన్యూ ఉద్యోగులకూ జీపీవోగా అవకాశమివ్వాలని కోరుతున్నాయి. 

నిరుద్యోగుల్లో ఆందోళన.. 

పాత వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఎంపిక చేసిన తర్వాత మిగిలిన 7,404 జీపీవో పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. టీజీపీఎస్‌‌‌‌సీ ద్వారా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయొచ్చని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.  

గతంలో జూనియర్​ పంచాయతీ సెక్రటరీల మాదిరి పరీక్ష​ నిర్వహించి.. నాలుగేండ్లు ప్రొబిషనరీ పీరియడ్​తర్వాత రెగ్యులర్‌‌ చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు రెవెన్యూ సంఘాలు ఉన్న ఉద్యోగుల్లోంచే సర్దుబాటు చేయాలని కోరుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ తరుణంలో గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టుల భర్తీపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.