
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రజలు అవకాశమివ్వాలని, తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ఆ పార్టీ కీలక నేత సోనియాగాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలనెలా మహాలక్ష్మి స్కీమ్ కింద రూ. 2,500 ఇస్తామని, బస్సుల్లో ఫ్రీ జర్నీ సదుపాయం కల్పిస్తామని, రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని చెప్పారు. ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన విజయభేరి సభలో సోనియాగాంధీ మాట్లాడారు.
తాను, తమ సహచరులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ వేదిక పైనుంచి మహాలక్ష్మి స్కీమ్తోపాటు మొత్తం ఆరు గ్యారంటీలను ప్రకటిస్తున్నామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామని, అన్ని వర్గాలకు మంచి చేస్తామని అన్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, అండగా నిలవాలని కోరారు. రాష్ట్రంలోని మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను అడ్రస్ చేసేలా ఈ ఆరు గ్యారంటీలను సోనియా ప్రకటించారు.