ఇయ్యాల ఢిల్లీకి సీఎం, భట్టి, ఉత్తమ్ .. సీఈసీ మీటింగ్ లో పాల్గొననున్న నేతలు  

ఇయ్యాల ఢిల్లీకి  సీఎం, భట్టి, ఉత్తమ్ .. సీఈసీ మీటింగ్ లో పాల్గొననున్న నేతలు  

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) మీటింగ్ లో వారు పాల్గొననున్నారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీఈసీ మెంబర్లు ఈ మీటింగ్​లో చర్చించనున్నారు. మీటింగ్ తరువాత గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం దేశ వ్యాప్తంగా 150 మందితో ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఆ లిస్ట్​లో తెలంగాణ నుంచి 9 లేదా 10 మంది పేర్లు ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈనెల 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని, సీట్ల వారీగా పేర్లను సీఈసీకి పంపినట్లు ఇటీవల సీఎం మీడియాకు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ నుంచి పోటీ చేసే 9 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించగా, 4 సీట్లకు బీఆర్ ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్, జహీరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ తో పాటు పలు సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.