
తెలంగాణ అసెంబ్లీ నుంచి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరోజు పాటు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గా రెడ్డి, పోడెం వీరయ్య, భట్టి విక్రమార్క, సీతక్క ఉన్నారు.
శనివారం.. సీఏఏ అంశంపై గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదని, సభకు ఆటంకం కలిగించే చర్యలను సహించమని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంటుందని, దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని ఆయన అన్నారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరిచి, అరాచకం సృష్టిస్తే కుదరదని తేల్చిచెప్పారు. ఏదో ఒక విధంగా బయటకు వెళ్లాలనే కాంగ్రెస్ సభ్యుల గొడవ చేస్తున్నారని, సభకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు.
‘ హు ఈజ్ ఆస్కింగ్ యూ హియర్(ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు).. గెట్ అవుట్ ఐ సే’ అంటూ కాంగ్రెస్ సభ్యులపై మండిపడ్డారు సీఎం. దీంతో ఆరుగురు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్ పోచారం .