- 12న గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష: మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 20న నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని ఆ పార్టీ నేత మల్లు రవి తెలిపారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్రెడ్డి సహా పలువురు నేతలు ఈ సభా వేదికగా కాంగ్రెస్లో చేరుతారని వెల్లడించారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న మల్లు రవి.. రాష్ట్రంలో, దేశంలో ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ చేతిలో ఓటమి తప్పదన్నారు. వంద సీట్లతో రాష్ట్రంలో, 300 సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ తీరును నిరసిస్తూ ఈ నెల 12న గాంధీ భవన్లోని గాంధీ విగ్రహం ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపడుతామని వెల్లడించారు.