
జన్నారం, వెలుగు: ఆదివాసీలకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్సేనని ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆదివాసీల ప్రతినిధులు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి సోమవారం సాయంత్రం హాజరై మాట్లాడారు.
ఆదివాసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిందని, ఆ హక్కులను సద్వినియోగం చేసుకునే బాధ్యత ఆదివాసీలపైనే ఉందన్నారు. రాజకీయం అంటే డబ్బు సంపాదించుకోవటం కాదు.. రాజకీయాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఆదివాసీల పాత్ర మరువలేనిదన్నారు.
ఆదివాసీలు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ చట్టాలపై ఆదివాసీలు అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసమే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, శిక్షణ శిబిరం నిర్వాహకులు రాణా ప్రతాప్, జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.