బీజేపీలోకి పలు పార్టీల నేతలు : ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది

బీజేపీలోకి పలు పార్టీల నేతలు : ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు పలు పార్టీల నేతలు. టీటీడీపీ నేతలు ఇ. పెద్దిరెడ్డి, బోడా. జనార్దన్, చాడా సురేష్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నేత రహమతుల్లా బీజేపీలో చేరారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు .. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు లక్ష్మణ్ ..తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. టీఆరెస్ కీలక నేతలైన కవిత, వినోద్ వంటి నేతలను ఓడించామని..టీఆరెస్ నేతల్లో కూడా అంతర్మథనం ప్రారంభమైందని తెెలిపారు.

కేసీఆర్ నియంతృత్వ వైఖరికి భరించలేక టీఆరెస్ నుంచి బీజేపీలో వలసలు మొదలయ్యాయని..ఇది ట్రైలర్ మాత్రమే,అసలు సినిమా ముందుందన్నారు. టీఆరెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందన్న ఆయన..నూతన భవనాలు నిర్మించతలపెట్టిన కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చుతూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న లక్ష్మణ్.. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూ టీఆరెస్ కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే కేసీఆర్ నూతన సచివాలయం, అసెంబ్లీల నిర్మాణాలు చేపడుతున్నారని సీరియస్ అయ్యారు లక్ష్మణ్.