- సెలక్షన్ లిస్ట్ లో తమకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన
- నార్మలైజేషన్ పేరుతో అక్రమాలు చేస్తున్నారని ఆరోపణ
- అరెస్టు చేసిన పోలీసులు..రాత్రి 8 గంటల వరకు నిర్బంధం
- భయాందోళనకు గురైన మహిళా అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు:
ప్రగతి భవన్ ముందు కానిస్టేబుల్ అభ్యర్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ విడుదల చేసిన కానిస్టేబుల్ పరీక్షల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రగతి భవన్ ను ముట్టడించారు. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లో కటాఫ్ మార్కులు, నార్మలైజేషన్ పేరుతో తమకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అభ్యర్థులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేడియంకు తరలించారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడే నిర్బంధించారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళా అభ్యర్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కటాఫ్ అంటూ కట్ చేశారు
కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో మొత్తం 17,156 పోస్టులకు అభ్యర్థులను బోర్డు ఎంపిక చేసింది. దీంతో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లో పేరు లేని అభ్యర్థులు బోర్డుకు తమ అభ్యంతరాలు తెలిపారు. జిల్లాలు, రిజర్వేషన్ కేటగిరీ, గ్రూపుల వారీగా అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు300ల మందికి పైగా అభ్యర్థుల ప్రొవిజనల్ సెలక్షన్ లో తీవ్ర తప్పిదాలు జరిగాయని వారు ఆరోపించారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను సెలెక్ట్ చేయకుండా తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారని అంటున్నారు.
నార్మలైజేషన్ పేరుతో అక్రమాలు
107 మార్కులు వచ్చిన వెంటకలక్ష్మి అనే యాదాద్రి భువనగిరికి చెందిన మహిళా అభ్యర్థికి నార్మలైజేషన్ పేరుతో 20 మార్కులు తగ్గించి 87 మార్కులు చేశారని కానిస్టేబుల్ క్యాండిడేట్లు ఆరోపించారు. ఇలా కటాఫ్ మార్కుల కంటే తక్కువ వచ్చిన వారిని ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో చేర్చారని చెప్పారు. ప్రతి కేటగిరీలో కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెలక్షన్ లిస్ట్ విడుదల చేయని 1,100 పోస్టుల జాబితానూ ప్రకటించాలన్నారు.