న్యూఢిల్లీ: మనదేశ వంటనూనెల దిగుమతుల విలువ 34.18 శాతం పెరిగి ఈ ఏడాది అక్టోబరు నాటికి రూ.1.57 లక్షల కోట్లకు చేరింది. అక్టోబరుతో ముగిసిన ఆయిల్ ఇయర్లో 140.3 లక్షల టన్నుల వంటనూనెను విదేశాల నుంచి కొన్నామని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెను దిగుమతి చేసుకొనే ఇండియా, 2020–21 ఆయిల్సంవత్సరంలో (నవంబరు–అక్టోబరు) రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంటనూనెను కొన్నది.
ఈ ఏడాది మొదటి రెండు క్వార్టర్లలో దిగుమతులు పెరగగా, మూడో క్వార్టర్లో తగ్గాయి. పామాయిల్ అమ్మకంపై ఇండోనేషియా నిషేధం తొలగించడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో నాలుగో క్వార్టర్లో మనదేశం భారీగా వంటనూనెను కొంది. ఈ ఏడాది పామాయిల్ ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ఇండియా దీని కొనుగోలుపై ప్రభావం కనిపించిందని ఎస్ఈఏ పేర్కొంది.
ముఖ్యంగా ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ మధ్య పామాయిల్ ధరలు మిగతా నూనెల ధరల స్థాయికి చేరాయి. ఇండోనేషియా నిషేధం విధించాక లభ్యత చాలా తగ్గింది. అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే 2021–22లో పామాయిల్ కొనుగోళ్లు రూ.83.21 లక్షల టన్నుల నుంచి 79.15 లక్షల టన్నులకు పడిపోయాయి. ఇతర నూనెల ఎగుమతులు మాత్రం 48.12 లక్షల టన్నుల నుంచి 61.15 లక్షల టన్నులకు పెరిగాయి.