బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్

బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్

కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని.. అందుకే, కరీంనగర్ లో రేవంత్ కాంగ్రెస్ తరుపున డమ్మీ అభ్యర్థి నిలబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి ముక్కు, మొహం తెలియని వ్యక్తిని తీసుకువచ్చి కరీంనగర్ లో నిలబెట్టారని చెప్పారు.  కాంగ్రెస్ అభ్యర్థికి కండువా లేకుండా తిప్పాపూర్ బస్టాండ్ లో నిలబెడితే.. ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తించని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉందన్నారు.  కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా? అంటూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు కేటీఆర్.

రోడ్ సెస్ పేరిట రూ.30 లక్షల కోట్లు వసూలు చేసి.. అందులో సగం సొమ్ముతో అంబానీ లాంటి వాళ్లకు ప్రధాని మోదీ రుణమాఫీ చేశారని విమర్శించారు.   తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ అని.. పదేళ్లలో ప్రజలను మోసం చేశాడని కేటీఆర్ ఫైరయ్యారు.  మనల్ని ప్రజలు ఓడించలేదన్న కేటీఆర్..
మనల్ని మనమే ఓడించుకున్నామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు12 ఎంపీ సీట్లు వస్తే.. కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే అవకాశం వస్తుందని కేటిఆర్ అన్నారు.