
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వేలాదిగా వచ్చే భక్తులను తిరుమల శ్రీవారి దర్శనానికి ఎలా అనుమతించాలన్న దానిపై టీటీడీ కసరత్తు పూర్తి చేసింది. గతంలో రోజూ 60 వేల నుంచి 80 వేల మంది వరకు స్వామిని దర్శించుకునే వారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో కొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది టీటీడీ. కొన్నాళ్ల పాటు కేవలం టైమ్ స్లాట్ దర్శనాలను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారిని మాత్రమే తిరుమల కొండపైకి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను అందుబాటులో ఉంచి ఆన్ టైన్ లో దర్శనం స్లాట్ బుక్ చేసుకున్న వారికి శ్రీవారి దర్శనం కల్పించబోతోంది. అయితే ప్రతి ఒక్కరినీ అలిపిరి వద్దే తనిఖీ చేసి దర్శనం టికెట్ ఉంటేనే కొండపైకి అనుమతిస్తారు.
తొలి మూడు రోజులు టీటీడీ ఉద్యోగులకు
ప్రతి రోజు 14 గంటల పాటు భక్తులును దర్శనానికి అనుమతించాలని, గంటకి 5 వందల మంది భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. అంటే రోజుకు ఏడు వేల మందికి మాత్రమే స్వామి దర్శన భాగ్యం కలగబోతోంది. లాక్ డౌన్ ముగిశాక ప్రభుత్వ అనుమతితో దర్శనాలు ప్రారంభించేందుకే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మొదటి మూడు రోజుల పాట టీటీడీ ఉద్యోగులును, ఆ తర్వాత తిరుమల, తిరుపతిలో ఉన్న స్థానికులను ప్రయోగాత్మకంగా 15 రోజులు పాటు అనుమతించే యోచనలో టీటీడీ ఉందని తెలుస్తోంది. ప్రయోగాత్మక పరిశీలన పూర్తయిన తర్వాత అంచెల వారీగా చిత్తూరు జిల్లా వాసులు, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా భక్తులును అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొండపై ఉన్న వసతి గదుల్లో ఇద్దరు మాత్రమే ఉండేలా పరిమితి విధించాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరి, నడకమార్గంలో వచ్చే భక్తులను థర్మల్ స్క్రీనింగ్ చేసి.. ఎటువంటి లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత యథావిధిగా అందరినీ దర్శనానికి అనుమతించాలని భావిస్తోంది.