కరోనా పేషెంట్ బంధువుల ఆరోపణ
హైదరాబాద్: కోవిడ్ లక్షణాలున్నాయని ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళితే.. నాలుగు రోజుల చికిత్సకి రూ. 4 లక్షల బిల్లు వేశారని వాపోయారు కరోనా పేషెంట్ బంధువులు. దమ్మాయిగూడకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ తన తల్లికి కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చికిత్స నిమిత్తం నగరంలోని కుషాయిగూడ తులసి హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రిలో చేరేముందు అతనికి సాధారణ బిల్లులు చెప్పి, నాలుగు రోజుల్లోనే సుమారు నాలుగు లక్షల బిల్లు వేశారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. అయితే పరిస్థితి విషమించి బుధవారం ఉదయం తన తల్లి మృతి చెందిందని.. మొత్తం డబ్బు కట్టిన తర్వాతనే మృతదేహాన్ని తీసుకెళ్లమని ఆసుపత్రి యాజమాన్యం చెప్పిందని అన్నారు. ఇక చేసేదేమీలేక మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నామని, తులసి ఆస్పత్రిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.