వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన బంజారాహిల్స్ మాజీ సీఐ నాగేశ్వర్ రావు ఎల్బీ నగర్ కోర్టులో రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై ఈనెల 7న కోర్టు నిర్ణయాన్ని ప్రకటించనుంది.
అసలు కేసు ఏంటీ..?
2018లో నమోదైన ఓ కేసులో వనస్థలిపురం హస్తినాపురానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న నాగేశ్వరరావు.. నిందితుడికి బెయిల్ వచ్చాక తన పొలంలో పనికి పెట్టుకున్నాడు. అతను, తన భార్యతో కలిసి నాగేశ్వర్రావుకి చెందిన పొలంలో పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో నిందితుడు ఇంట్లో లేని సమయం చూసి..అతడి భార్యపై నాగేశ్వర్రావు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నేరుగా ఇంటికెళ్లి అత్యాచారం ..
ఈ నెల 6వ తేదీన బాధితురాలికి నాగేశ్వర రావు వాట్సాప్ కాల్ చేసి.. తన లైంగిక కోర్కెలు తీర్చాలని బెదిరించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నేరుగా హస్తినాపురంలోని ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెపై దాడి చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. భార్య ఏడుపులు విని డోర్స్ పగులగొట్టి ఇంట్లోకి వచ్చి నాగేశ్వర్రావుపై కర్రతో దాడి చేశాడు. దాంతో సీఐ రివాల్వర్ ను బయటకు తీసి..చెప్పినట్లు వినకుంటే బ్రోతల్ కేసు పెడతానని దంపతులిద్దరిని బెదిరించి ఓ వెహికిల్లో ఎక్కించి.. వనస్థలిపురం నుంచి ఇబ్రహింపట్నానికి బయలుదేరాడు. కారు వెనుక సీట్లో బాధితురాలు కూర్చోగా..ఆమె ముందు సీట్లో నాగేశ్వర్రావు కూర్చున్నాడు. బాధితురాలి భర్తను డ్రైవ్ చేయాలని గన్పెట్టాడు. మార్గ మధ్యలో ఇబ్రహింపట్నం సమీపంలోని చెరువు బ్రిడ్జి వద్ద కారు ప్రమాదానికి గురైంది. దాంతో భార్యాభర్తలు అక్కడి నుంచి తప్పించుకుని వనస్థలిపురం వచ్చారు. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.