కరోనా సమయంలో సైబర్ క్రైమ్లు, మహిళలపై సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయని సీపీ సజ్జనార్ అన్నారు. శనివారం సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యూ ఎంప్లాయిస్(విమెన్) సేఫ్టీ పై ఈ లెర్నింగ్ అవేర్ నెస్ ప్రోగ్రాం జరిగింది. ఉద్యోగాల్లో కొత్తగా చేరిన మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై జరిగిన ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ సెక్టార్ లో కొత్తగా వచ్చే మహిళ ఉద్యోగులు వర్క్ ప్లేస్ లో వేధింపులకు గురి అవుతున్నారని, బ్లాక్ మెయిలింగ్, సెక్సువల్ హెరాస్మెంట్ కు గురి అవుతున్నారన్నారు. మహిళా ఉద్యోగులు కోసం కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
సైబరాబాద్ పోలీస్ ఎస్సీఎస్సీ ద్వారా మహిళా ఉద్యోగుల కోసం రక్షణ ఏర్పాట్లు చేశామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ లెర్నిగ్ మాడ్యూల్ ద్వారా మహిళ ఉద్యోగుల రక్షణ కోసం ఇది పనిచేస్తుందన్నారు. 20 నిమిషాల ఈ లెర్నింగ్ మాడ్యూల్ ను కొత్తగా వచ్చే ఉద్యోగులకు కంపెనీలు నిర్వహించాలన్నారు. వేధింపుల గురి అయితే ఎక్కడ పిర్యాదు చేయాలనే సమాచారం ఈ మాడ్యూల్ లో ఉంటుందని చెప్పారు.
కోవిడ్ కారణంగా సోషల్ మీడియా ద్వారా వేధింపులు ఎక్కువయ్యాయని వీటి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని సజ్జనార్ వివరించారు. సుమారు 65వేల మంది మహిళా ఉద్యోగులు ఐటీ సంస్థలో పనిచేస్తున్నారని, వీరి భద్రతకు ఆయా సంస్థలు విమెన్ సేఫ్టీ వింగ్స్ను ఏర్పాటు చేశాయని అన్నారు. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు సైతం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉమెన్ ఫోరమ్ సభ్యుల కృషితో ఐటీ కారిడార్లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.
ఈ సదస్సులో పాల్గొన్న డీసీపీ అనసూయ మాట్లాడుతూ… కొత్తగా వచ్చే మహిళా ఉద్యోగులు వర్క్ ప్లేస్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ మధ్యకాలం లో ఆన్లైన్లోనూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని, షీ టీమ్స్ కు కూడా అనేక కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పారు. మహిళ భద్రత కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్లు పని చేస్తున్నాయని.. వర్క్ ప్లేస్ లో ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్, డీసీపీ అనసూయలతో పాటుగా ఎస్.సి.ఎస్.సి జనరల్ సెక్రెటరీ కృష్ణ, ఎస్ సి,ఎస్ సి జాయింట్ సెక్రటరీ ప్రత్యూష పాల్గొన్నారు.