కేసీఆర్ పవర్ కట్స్ ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

కేసీఆర్ పవర్ కట్స్ ట్వీట్ పై  సీఎం రేవంత్ రెడ్డి  ఫైర్

తెలంగాణలో పవర్ కట్స్ అంటూ బీఆర్ఎస్ చీఫ్,  మాజీ సీఎం కేసీఆర్ చేసిన ట్వీట్.రాజకీయదుమారం రేపింది. నిన్న మహబూబ్ నగర్ లోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంట్ పోయిందని ట్విట్టర్ లో చెప్పారు కేసీఆర్. రోజుకు పదిసార్లు కరెంట్ పోతుందని తనతో ఎమ్మెల్యేలు చెప్పినట్లు చెప్పారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు.  రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని ట్వీట్ చేశారు కేసీఆర్.

అయితే కేసీఆర్ ట్వీట్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. విచారణకు వెంటనే ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన మహబూబ్ నగర్ విద్యుత్ అధికారులు.. ఎలాంటి పవర్ కట్స్ లేవని తేల్చి చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ నివాసముంటున్న ప్రాంతంలో చెక్ చేశామని.. విద్యుత్ సబ్ స్టేషన్లో కూడా రికార్డులను చెక్ చేశామన్నారు. నిన్న ఎలాంటి పవర్ కట్స్ లేవని విద్యుత్ అధికారులు క్లారిటీ ఇచ్చారు.  

లేనిపోని అబద్ధాలతో కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. మొన్న సూర్యాపేటలో కరెంట్ పోయిందని అబద్ధం చెప్పారు. ఇవ్వాళ  మహబూబ్‌నగర్‌లోనూ ఇప్పుడు అవే అబద్ధాలు చెప్పారని ఫైరయ్యారు.  కేసీఆర్‌కు మరీ ఇంత అధికార దాహం ఎందుకని ప్రశ్నించారు.  ఓడిన తర్వాత కూడా ఆయనకు ఇంకా గర్వం తగ్గలేదన్నారు సీఎం రేవంత్.