జనగామ, వెలుగు: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరు, అట్రాసిటీ కేసుల నమోదు, వాటి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ విధానాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె.లక్ష్మీ నారాయణ, రాంబాబు నాయక్, సంతోష్ నాయక్, శంకర్, డీఎంహెచ్ఓ వాణి శ్రీ, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్ ఉన్నారు
