
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి: డి.రాజా
- దేశ చరిత్రను మార్చేందుకు బీజేపీ నేతల కుట్ర
- కమ్యూనిస్టులు చరిత్రలో భాగం కాదు.. చరిత్ర సృష్టికర్తలు
- కేంద్రంతో కేసీఆర్ రాజీ పడ్డరు.. అందుకే కవిత అరెస్ట్ కాలె: నారాయణ
- ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీఐ భారీ బహిరంగ సభ
హైదరాబాద్, వెలుగు: నిజాం వ్యతిరేక పోరాటంలో, భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్ పాత్ర ఏంటో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ అబద్ధాలు చెబుతున్నారని, దేశ చరిత్రను మార్చేందుకు మోదీ, అమిత్ షా, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీంతో రాష్ట్రంలో, దేశంలో మతతత్వ, ఫాస్టిస్టు బీజేపీ ప్రభుత్వాన్ని, దాని మిత్రపక్షాలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ‘ఇండియా’కూటమిగా ముందుకెళ్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేయగలనని అనుకుంటున్నారని, కానీ రాష్ట్ర ప్రజలు ఈసారి మోసపోరన్నారు. ఆదివారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించారు. దీనికి చీఫ్ గెస్ట్గా డి.రాజా హాజరై, మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్లో తెలంగాణ భాగమైందని, దీన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. అసలు ఆ పోరాటంలో బీజేపీ పాత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులు చరిత్రలో భాగం కాదని, చరిత్ర సృష్టికర్తలని స్పష్టం చేశారు. నిజాం వ్యతిరేక పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య పోరుగా చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నదని మండిపడ్డారు.
‘ఇండియా’తో మోదీకి కలవరం..
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన ‘ఇండియా’కూటమిని చూసి ప్రధాని మోదీ కలవరపాటుకు గురవుతున్నారని డి.రాజా అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ‘బీజేపీ హఠావో, దేశ్ బచావో’నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నికతో ఎన్నికల ఖర్చు తగ్గుతుందని మోదీ అంటున్నారని, ఇటీవల వచ్చిన కాగ్ రిపోర్టులో జాతీయ రహదారుల నిర్మాణంలో రూ.7.5 లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు చెప్పిందని, ముందు దాని సంగతి చూడాలన్నారు. జీ20 సమావేశాల తర్వాత మోదీ అంతర్జాతీయంగా శక్తివంతుడయ్యారని బీజేపీ గొప్పలు చెప్పుకుంటోందని, కానీ ఆ సమిట్ తర్వాతే, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైందని గుర్తుచేశారు.
మతోన్మాదుల నుంచిదేశాన్ని కాపాడాలి: సురవరం
హిందూత్వ మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన అవసరముందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర తరహాలోనే ఏపీ, తెలంగాణలోనూ బీజేపీ ప్రమాదకరమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు. విలీన దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడుతోందని ఎద్దేవా చేశారు. అదానీకి ప్రధాని మోదీ బానిసగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.
Also Rard: ‘కుమారి శ్రీమతి’గా నిత్యా మీనన్
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం మీనన్నేని సాంబశివరావు మాట్లాడుతూ, తెలంగాణ రాక ముందు విలీన దినాన్ని నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్.. ఎంఐఎంకు భయపడి సమైక్యతా దినోత్సవం అంటూ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ఆయనొక పిరికి సీఎం అని మండిపడ్డారు. భూస్వాములకు, పేదలకు మధ్య జరిగిన పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారని గుర్తుచేశారు. ఈ పోరాటంతో సంఘ్కు, బీజేపీకి సంబంధం లేదన్నారు. అయినా, విమోచనమంటూ హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
అందుకే కవిత అరెస్ట్ కాలె: నారాయణ
బీజేపీతో సీఎం కేసీఆర్ రాజీపడ్డాడు కాబట్టే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్లల్లో ఎవరైనా బీజేపీలో ఉన్నారా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి మోదీ వివరించాలని డిమాండ్ చేశారు. హిందువులకు సననాతర ధర్మంతో సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి, కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ, వీఎస్ బోస్, బాలమల్లేశ్, నర్సింహా, శంకర్, హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి, కవి జయరాజ్, తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు మొయినుద్దీన్ను సన్మానించారు. అంతకుముందు సీపీఐ స్టేట్ ఆఫీసులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విలీన దినోత్సవం సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి జాతీయ పతకాన్ని, కూనంనేని సాంబశివరావు సీపీఐ జెండాను ఎగరవేశారు.