పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది : సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా

పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది : సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా
  • భారత సైన్యానికి రెడ్ సెల్యూట్

బషీర్​బాగ్, వెలుగు: ఫ్యాసిజంపై రష్యా కమ్యూనిజం సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో నయా ఫాసిజంపై పోరాటాలు నిర్మించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ, భారత సాంస్కృతిక స్నేహ సంఘం (ఇస్కప్) అధ్యక్ష వర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా పిలుపునిచ్చారు. ఫ్యాసిజంపై విజయం సాధించిన 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హిమాయత్ నగర్ లోని ఇస్కప్ రాష్ట్ర కార్యాలయంలో సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు అజీజ్ పాషాతో పాటు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్  జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, ఇస్కప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి ప్రభాకర్, ఐప్పో రాష్ట్ర సమన్యయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, ఇస్కప్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.గోపాల్, అరుణ్ కుమార్, ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షులు మునీర్ పటేల్, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు ఆర్.శంకర్ నాయక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్యాసిజంపై రష్యా విజయం సాధించిందని వివరించారు. అనంతరం పల్గాహంలో టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత అమాయక ప్రజల ప్రాణాలు తీసిన పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా తదితర ఉగ్రవాద ముష్కర మూకలకు పాకిస్తాన్ శిక్షణ ఇచ్చి భారత్‌‌లోకి ఎగదొలుతుందని మండిపడ్డారు.

హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించేందుకు పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలు ప్రయత్నించాయన్నారు. పాకిస్థాన్ పై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి రెడ్ సెల్యూట్ చేస్తున్నామన్నారు. ప్రపంప దేశాలన్ని భారత్ మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. అంతకుముందు భారత సైన్యానికి సంఘీభావంగా హిమాయత్ నగర్ నుంచి హైదర్ గూడ వరకు ఇస్కప్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ ముర్దాబాద్, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.