
- రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నరు
యాదగిరిగుట్ట, వెలుగు : దేశంలో అధ్యక్ష పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.సాయిబాబా ఆరోపించారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్లో సోమవారం జరిగిన సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశానికి ఆత్మ వంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని, దాన్ని తిప్పికొట్టే బాధ్యత కమ్యూనిస్టులపైనే ఉందన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రులుగా పనిచేసిన 14 మంది కలిపి రూ.50 లక్షల కోట్ల అప్పులు చేస్తే... 15వ ప్రధాని అయిన మోదీ ఒక్కడే పదేండ్లలో రూ.170 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఆకలి సూచీలో దేశం 104లో స్థానంలో ఉంటే అభివృద్ధి చెందినట్లు ఏ విధంగా చెబుతున్నారని ప్రశ్నించారు. కార్పొరేట్ల అభివృద్ధి జపం చేస్తున్న మోదీకి పేదలను అభివృద్ధి చేయాలన్న పట్టింపు లేదని విమర్శించారు. పేదలను పట్టించుకోని ప్రభుత్వాలు, పాలకులు కాలగర్భంలో కలిసిపోయారని.. బీజేపీకి, మోదీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
ప్రపంచ దేశాలు శాస్త్రీయంగా ముందుకు పోతుంటే.. మోదీ మాత్రం మూఢాచారాలకు పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశ రక్షణ, ప్రజలకు భద్రత లోపించిందని, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి, పట్టణ కార్యదర్శి భాస్కర్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహ, అనురాధ, కార్యదర్శివర్గ సభ్యులు మల్లేశం, పాండు, పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే.లతీఫ్ పాల్గొన్నారు.