క్రికెట్ బెట్టింగ్ వ్యసనం.. చైన్ స్నాచర్ గా మారిన ఆర్మీ జవాన్

క్రికెట్ బెట్టింగ్ వ్యసనం.. చైన్ స్నాచర్ గా మారిన ఆర్మీ జవాన్
  •     అప్పులు తీర్చేందుకు మహిళ మెడలో గొలుసు లాకెళ్లిండు
  •     నకిలీ నంబర్ ప్లేట్​తో స్కెచ్.. నిందితుడు అరెస్ట్

మల్కాజిగిరి, వెలుగు: క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ ఆర్మీ జవాన్​ను చైన్ స్నాచర్​గా మార్చింది. అప్పులు తీర్చేందుకు మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన నిందితుడిని నేరెడ్​మెట్ అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీపీ యాదగిరి రెడ్డి గురువారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. కడప జిల్లా సంబేపల్లె మండలానికి చెందిన కుర్రపోతుల రెడ్డిశేఖర్ (31) ఆర్మీలో జవాన్​గా పనిచేస్తూ, ప్రస్తుతం అల్వాల్​లోని ఆర్మీ క్వార్టర్స్​లో నివసిస్తున్నాడు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్​లకు బానిసై, భారీగా నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక గొలుసు దొంగతనాలకు ప్లాన్ వేశాడు. 

నకిలీ నంబర్ ప్లేట్​తో..

నిందితుడు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన పల్సర్ బైక్ ఒరిజినల్ నంబర్ ప్లేట్ పైన నకిలీ నంబర్ స్టిక్కర్​ను అతికించాడు. ఈ నెల10న రాత్రి 7 గంటల సమయంలో సప్తగిరి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మణి మేఘల (57) అనే మహిళను చిరునామా అడుగుతున్నట్లు నటించి అడ్డగించాడు. ఆమె తేరుకునేలోపే మెడలోని 3 తులాల నల్లపూసల గొలుసును తెంచుకుని పరారయ్యాడు. 

ఆ బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్​లో తాకట్టు పెట్టి రూ. 2.10 లక్షలు తీసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నేరెడ్​మెట్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బుధవారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు.  ఇన్​స్పెక్టర్ పి. సందీప్ కుమార్, ఎస్ఐ జి. చంద్రశేఖర్ బృందం అతి తక్కువ కాలంలోనే ఈ కేసును ఛేదించడంతో ఉన్నతాధికారులు వారిని అభినందించారు.