రాష్ట్రంలో కరెంట్, ఆర్టీసీ చార్జీలూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కరెంట్ చార్జీలు దాదాపు రెట్టింపయ్యాయి. నిరుడు మార్చిలో ఒక్కో యూనిట్పై రాష్ట్ర సర్కారు 50 పైసలు పెంచగా.. కస్టమర్ చార్జీలనూ డబుల్ చేసింది. ఈ నేపథ్యంలోనే కరెంట్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. గతంలో సగటున నెలకు రూ.200 వచ్చే బిల్లు కాస్తా ఇప్పుడు ఏకంగా రూ.400దాకా వస్తున్నది.
కొత్త శ్లాబులతో బిల్లులు డబుల్ అయ్యాయి. వాటికి తోడు ఏసీడీ చార్జీల పేరిట ఇటీవల జనం నుంచి డిస్కంలు వసూలు చేశాయి. దానికి తోడు బస్ చార్జీలనూ ఆర్టీసీ పెంచింది. రౌండాఫ్ పేరుతో ఓసారి, సెస్ల రూపంలో రెండు సార్లు చార్జీలను పెంచింది. దానికితోడు బస్ పాస్ ధరలనూ భారీగా పెంచారు.
ఏకంగా మూడు రెట్లు పెంచడంతో స్టూడెంట్లు, చిన్న చిన్న ఉద్యోగస్తులకు తిప్పలు తప్పడం లేదు. ఇటీవలే టోల్ చార్జీలు పెరగడంతో.. ఆ భారాన్నీ ప్రయాణికులపైనే ఆర్టీసీ వేస్తున్నది. రూ.10 నుంచి రూ.20 వరకు పెంచింది.