- ఫేక్ లింక్లు పంపుతున్న సైబర్ చీటర్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రస్తుతం దేశంతో పాటు తెలంగాణలో జనగణన ప్రక్రియ జరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ప్రభుత్వ సర్వే నమోదు, వివరాలు అప్డేట్ చేస్తామంటూ మొబైల్ ఫోన్లకు లింకులు పంపిస్తున్నారు. ఈ లింకులను క్లిక్ చేయగానే అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ పేజీలు ఓపెన్ అవుతాయి.
అక్కడ మీ పేరు, ఆధార్ సంఖ్యతో పాటు వ్యక్తిగత వివరాలను నమోదు చేయమని కోరుతూ, చివరగా వెరిఫికేషన్ పేరుతో ఓటీపీని అడుగుతారు. పొరపాటున ఆ ఓటీపీని చెబితే మీ బ్యాంక్ ఖాతాలోని సొమ్ము క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు ప్రక్రియ ఎలా ఉంటుంది?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అధికారిక జనగణన సిబ్బంది నేరుగా మీ ఇంటికే వచ్చి వివరాలను సేకరిస్తారు. వారు కేవలం ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అడుగుతారు తప్ప మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు లేదా పిన్ కోడ్ లను అడగరు. ముఖ్యంగా, జనగణన ప్రక్రియలో ఎక్కడా క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయమని చెప్పడం లేదా నగదు చెల్లింపులు చేయమని కోరడం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా లేదా వాట్సాప్ మెసేజ్ల ద్వారా ప్రభుత్వం ఎలాంటి వ్యక్తిగత సెన్సస్ డేటాను సేకరించదని పేర్కొన్నారు.
వ్యక్తిగత భద్రతే ప్రధాన ఆయుధం
సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు. ఒకవేళ అనుకోకుండా ఇటువంటి మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 అనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరాల నివారణకు అప్రమత్తత, అవగాహన మాత్రమే రక్షణగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.
