- దేశంలో ఎక్కడ నేరం జరిగినా గుర్తించేలా డిజిటల్ రికార్డ్స్
- సైబర్ క్రైమ్పై గ్రేటర్ పోలీసుల ఫోకస్
- 25 రకాలకుపైగా నేరాల గుర్తింపు
- నిందితుల వివరాల ఆధారంగా ట్రేసింగ్
హైదరాబాద్,వెలుగు: దోపిడీలు, దొంగతనాలతో పోలిస్తే రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కొత్త స్కెచ్లు వేస్తున్నారు. ఆన్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అడ్డాగా అందినంతా దోచేస్తున్నారు.ఫేక్ మొబైల్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్స్తో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు.ఇలాంటి నేరాలను కట్టడి చేసేందుకు గ్రేటర్లోని హైదరాబాద్,సైబరాబాద్, రాచకొండ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో ఏర్పాటైన సైబర్ క్రైమ్ బ్యూరోతో కలిసి గత ఐదేండ్లుగా రిపోర్ట్ అయిన కేసులతో డేటాబేస్ తయారు చేస్తున్నారు.
గతేడాది గ్రేటర్లోనే 9,148 కేసులు
2019లో రాష్ట్ర వ్యాప్తంగా 2,691సైబర్క్రైమ్ కేసులు నమోదైతే గతేడాది వరకు వీటి సంఖ్య 15,217కు చేరింది.ఇందులో గ్రేటర్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 9,148 కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో కేవలం10 శాతం కేసులను మాత్రమే పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫైల్ అవుతున్న కేసులతో పోలిస్తే గ్రేటర్ లోని3 కమిషనరేట్ల పరిధిలోనే సైబర్ నేరాలు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. ఇందుకు కారణం తమిళనాడు, కేరళ, కర్నాటక, ఏపీతో పోలిస్తే హైదరాబాద్లో హిందీ,ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. దీంతో రాజస్థాన్, బిహార్ ,జార్ఖండ్, వెస్ట్బెంగాల్ సహా నార్త్ ఇండియాలోని ఇతర రాష్ట్రాలు, ఢిల్లీలోని సైబర్ నేరగాళ్లు గ్రేటర్ హైదరాబాద్పై ఫోకస్ పెట్టారు. వివిధ ఈ– కామర్స్ సైట్లు, కాల్ సెంటర్లు, బ్యాంక్అధికారులు, గిఫ్ట్ల పేరు చెప్పి వరుస మోసాలకు పాల్పడుతున్నారు.
ఫోన్ నంబర్లు, ఐపీ అడ్రెస్లతో..
సిటీలో ప్రాపర్టీ అఫెన్స్ల కంటే సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతుండడంతో గ్రేటర్ పోలీసులు స్పెషల్ ప్లానింగ్ రూపొందిస్తున్నారు. మొత్తం 25 రకాలకు పైగా సైబర్ నేరాలకు సంబంధించిన డేటాను సేకరించారు. ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయనే వివరాలతో డిజిటల్ రికార్డ్స్ సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే అరెస్టయిన నిందితులు, వారి ఫింగర్ ప్రింట్స్, ఆధార్ నంబర్ సహా పూర్తి వివరాలను సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేస్తున్నారు. వీటితో పాటు సైబర్ క్రైమ్ కేసుల్లో ఉపయోగించిన ఫోన్ నంబర్లు, ఐపీ అడ్రెస్లతో డేటా తయారు చేశారు. వీటి ఆధారంగా దేశ వ్యాప్తంగా ఎలాంటి సైబర్క్రైమ్ కేసు రిపోర్ట్ అయినా సంబంధిత పోలీసులకు వెంటనే సమాచారం చేరుతుంది. దీంతో ఆయా నేరాలకు సంబంధించిన డేటాబేస్తో నిందితులు, డబ్బు ట్రాన్స్ఫర్ అయిన బ్యాంక్ అకౌంట్లను సులభంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువే..
లోన్ యాప్స్తో పాటు మొత్తం 25 రకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అత్యధికంగా ఈ ఏడాది 4 నెలల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో పాటు ప్రతి ఏటా నమోదయ్యే కేసుల్లో 66 శాతం ఫేక్ కస్టమర్ కేర్ ఫ్రాడ్స్, అడ్వర్టయిజ్ మెంట్ పోర్టల్స్, లోన్స్, జాబ్ ఫ్రాడ్స్, హ్యాకింగ్స్, ఫేక్ లింక్స్, ఓటీపీ, స్పూఫింగ్, ఫిషింగ్ మెయిల్స్, వాట్సాప్,ఫేక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై జరుగుతున్నవే. ఇంటర్నెట్ ఆధారిత సర్వీసెస్లో సైబర్ నేరగాళ్లు దేన్నీ వదలడం లేదు. నకిలీ లింక్స్ పంపించి ఓటీపీలతో బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో ప్రతి ఏటా సుమారు18వేలకు పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిలో కేసుల తీవ్రత ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. రూ.లక్షకు పైగా మోసం జరిగిన కేసుల్లో మాత్రమే సైబర్క్రైమ్ పోలీసులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు.రూ.లక్ష లోపు మోసం జరిగిన కేసులను లా అండ్ ఆర్డర్ పోలీసులే రిజిస్టర్ చేస్తున్నారు.
సైబర్ మోసాల బారిన పడొద్దు
సైబర్ నేరగాళ్ల డేటాను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంటాం .అరెస్ట్ చేసిన సమయంలో ఆధారాలు సేకరిస్తాం. సైబర్ చీటింగ్ ఎలా చేశారు? వాళ్ల టీమ్లో ఎంత మంది ఉన్నారనే వివరాలు తీసుకుంటాం. ఫేక్ ఫోన్ నంబర్లు, వర్చువల్ బ్యాంక్ అకౌంట్లతోనే సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జనాలు అలర్ట్ గా ఉండాలి. మోసం జరిగిన వెంటనే 1930 నంబర్ కు కాల్ చేయాలి. లేదాhttps://cybercrime.gov.in/లో కంప్లయింట్ చేయొచ్చు.
– కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్,