కోల్కతా: ఇండియాలో జరిగే తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ టికెట్లకు వీపరితమైన డిమాండ్ ఏర్పడింది. ఈడెన్ గార్డెన్స్లో ఈనెల 22–26 వరకు ఇండియా, బంగ్లాదేశ్ తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పింక్బాల్తో టెస్ట్ ఆడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్ని తలపిస్తున్నాయి. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) సమాచారం మేరకు మ్యాచ్ తొలి మూడు రోజుల్లో.. రోజుకు 50,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరు కానున్నారు. ఈ 50 వేల టికెట్లలో 17వేలు మాత్రమే ఆన్లైన్లో విక్రయించామని, మిగిలినవి అఫిలియేటెడ్ మెంబర్స్కు ఇచ్చామని క్యాబ్ అధికారి ఒకరు తెలిపారు. తొలి మూడు రోజుల టికెట్లకు చాలా డిమాండ్ ఉందని, 14వ తేదీ నుంచి మిగతా16,000 టికెట్లు కౌంటర్ల ద్వారా విక్రయిస్తామని తెలిపారు. ఈడెన్ కెపాసిటీ 68 వేలు. ఫ్యాన్స్ రెస్పాన్స్ చూస్తుంటే.. అది హౌస్ఫుల్ అయ్యేలా ఉంది.