హైద‌రాబాద్‌లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి: ష‌బ్బీర్ అలీ

హైద‌రాబాద్‌లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి: ష‌బ్బీర్ అలీ

హైద‌రాబాద్‌లో క‌రోనా పరిస్థితిపై గ‌వ‌ర్న‌ర్ క‌ల‌గ‌జేసుకోవాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ష‌బ్బీర్ కోరారు. క‌రోనాపై చ‌ర్చించేంందుకు గ‌వ‌ర్న‌ర్ పిలుస్తుంటే వెళ్ల‌కుండా సీఎస్ రాజ్యాంగాన్ని అవ‌మానించార‌ని అన్నారు. క‌రోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి మృత‌దేహాల‌ను సైతం ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు ష‌బ్బీర్ అలీ. క‌రోనా కేసులు భారీగా పెరుగుతూ ప‌రిస్థితి దిగ‌జారుతున్నా ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌ద‌న్నారు. రాజ్యం త‌గ‌ల‌బ‌డుతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్న రోమ్ చ‌క్ర‌వ‌ర్తి మాదిరిగానే సీఎం కేసీఆర్ వ్య‌వ‌హారం ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విభ‌జ‌న చ‌ట్టంలోని సెక్ష‌న్ -8ను అమ‌లు చేసి, గ‌వ‌ర్న‌ర్ త‌న అధికారాల‌ను వినియోగించుకోవాల‌ని లేఖ రాస్తామ‌ని చెప్పారు కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ. హైద‌రాబాద్‌లో వెంట‌నే హెల్త్ ఎమర్జెన్సీ ప్ర‌క‌టించాల‌ని కోరారు. స‌చివాల‌యం కూల్చివేత విష‌యంలోనూ కేసీఆర్ వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారాయ‌న‌. దొంగ‌లెక్క అర్ధ‌రాత్రి వేళ సెక్ర‌టేరియ‌ట్ కూల్చివేయాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని ప్ర‌శ్నించారు. మంచిగా ఉన్న బిల్డింగ్‌ను కూల్చివేయ‌డం ఎందుక‌ని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచార‌ణ ఉండ‌డంతోనే ఆగమేఘాల‌పై కూల్చేశార‌ని ఆరోపించారు.